హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): అసలే మానసికస్థితి సరిగ్గా లేదు.. అందులో కరోనా భయంతో తల్లీబిడ్డలు రెండేండ్లుగా కాలు బయటపెట్టకుండా ఇంటికే పరిమితమయ్యారు. బాహ్య ప్రపంచాన్ని మరచి నాలుగుగోడల మధ్యే జీవిస్తున్నారు. ఏపీలోని కాకినాడ జిల్లా కాజులూరు మండలం కొయ్యూరుకు చెందిన సూరిబాబుకు భార్య మణి, కూతురు దుర్గాభవానీ ఉన్నారు. వీరిద్దరికీ మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటున్నారు.
కరోనా విజృంభించిన తర్వాత తల్లీకూతురు మరింత భయాందోళనకు గురై ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ఏండ్లు గడుస్తున్నా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని బలవంతంగా కాకినాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.