హైదరాబాద్, సెప్టెంబరు 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ తన నైజాన్ని బయటపెట్టుకొంటున్నది. తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తూనే.. మరోవైపు బుకాయింపులకు పాల్పడుతున్నది. పని తక్కువ చేస్తూ.. ప్రచారం ఎక్కువ చేసుకొంటున్నది. వాస్తవాలను వక్రీకరిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నది. దీనిలో భాగంగా కేంద్ర మంత్రులను తెలంగాణకు పంపి ఇక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తున్నది. రాష్ట్రంపై అన్నింటా వివక్ష చూపుతూ తామే ఎక్కువ చేస్తున్నామంటూ కేంద్ర మంత్రులు లడాయికి దిగుతున్నారు. ప్రభుత్వ అధికారిక ప్రచార విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తెలంగాణకు సంబంధించిన పలు విషయాలను అధికారికంగా వివిధ సందర్భాల్లో విడుదల చేస్తుంటుంది. అయితే అధికారిక సమాచారానికి విరుద్ధంగా కేంద్ర మంత్రులు, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు.
నాబార్డు సహా కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు కాళేశ్వరం ప్రాజెక్టుకు అతి తక్కువ వడ్డీకి రూ.86 వేల కోట్ల రుణాలు ఇచ్చాయని పీఐబీ గతంలో వెల్లడించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చారంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో మాట్లాడటం గమనార్హం. టీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ నాయకత్వం పట్ల విష బీజాలు నాటాలన్న లక్ష్యంలో భాగంగా తప్పుడు సమాచారాన్ని ప్రజల మనస్సుల్లో చొప్పించాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవాలు ఒక విధంగా ఉంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నాం కాబట్టి మీడియా, ప్రజలు నమ్ముతాయనే ఉద్దేశంతో కేంద్ర మంత్రుల చేత బీజేపీ తెలంగాణపై దాడి చేయిస్తున్నది.
ఉజ్వల యోజన కింద కేంద్రం తెలంగాణకు 11 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది.
ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా 9 కోట్ల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసిన కేంద్రం.. జనాభా ప్రాతిపదికన తెలంగాణకు దాదాపు 35 లక్షలకుపైగా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉన్నది. కానీ 11 లక్షలు మాత్రమే ఇచ్చింది. ఈ పథకాన్ని తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలు చేయడానికి చేతులు రావడంలేదు.
రైల్వేలో 16 ప్రాజెక్టులను, 9 కొత్త లైన్లు, 7 డబ్లింగ్ ప్రాజెక్టు పనులను రూ.31,281 కోట్లతో కేంద్రం చేపట్టింది.
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్లు, డబ్లింగ్, విద్యుద్దీకరణ తదితర పనులకు ఎన్నో ఏండ్లుగా నిధులు విడుదల కావడంలేదు. పనులు ముందుకు సాగడంలేదు. ఉత్తరాది, దక్షిణాదికి మధ్య వారధిగా ఉన్న తెలంగాణలో రైల్వే పనులు చేపట్టడంలో కేంద్రం వివక్ష చూపుతున్నది. ఎన్నో ఏండ్ల కింద మంజూరైన పనులను ఇప్పుడు చేస్తూ వాటిని తమ ఘనతగానే కేంద్రం చెప్పుకొంటున్నది. అదనపు రైళ్లు, అదనపు నిధులు, అదనపు లైన్లు లేవు. కానీ మాటలు, ప్రచార ఆర్భాటం మాత్రం అందనంత ఎత్తులో ఉన్నాయి. తెలంగాణకు రావాల్సిన వాటా, ఇక్కడ మెరుగుపర్చాల్సిన మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదు. పనులు ఏండ్ల కొద్దీ సాగదీస్తూ అవే పనులను పదేపదే చూపిస్తూ కాలం వెళ్లదీస్తున్నది.
పీఎం కిసాన్తో 40 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లను కేంద్రం ఇచ్చింది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణలో ప్రారంభించిన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి ప్రవేశపెట్టిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం.. ప్రచారంలో ముందున్నది. 5 ఎకరాల వరకు ఉన్న రైతుకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్నది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏటా రూ.10 వేలు అందజేస్తున్నది. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో దాదాపు రూ.60 వేల కోట్ల వరకు తెలంగాణ ప్రభుత్వం జమచేసింది. కేంద్ర ప్రభుత్వం రూ.7,500 కోట్లు మాత్రమే జమచేసింది. కేంద్రం ఇచ్చిన నిధులకు రైతుబంధు నిధులకు ఏ మాత్రం పొంతన లేకున్నా ప్రచార ఆర్భాటం మాత్రం ఎక్కువ.
తెలంగాణకు 2 లక్షల పట్టణ గృహాలను కేంద్రం మంజూరు చేసింది.
ఇండ్ల విషయంలో కేంద్రం పాడిందే పాటరా అన్నట్టు వ్యవహరిస్తున్నది. ఎనిమిదేండ్లలో 2 లక్షల ఇండ్లు ఇచ్చాం.. 2 లక్షలు ఇచ్చాం అంటూ పదేపదే చెప్తున్నది. కానీ సగటున ఏడాదికి 25 వేల ఇండ్లు కూడా మంజూరు చేయలేదు. అయినా పాత పాటనే పాడుతూ తెలంగాణకు ఏదో చేసిపెట్టామంటూ బుకాయిస్తున్నది. దేశంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ కట్టిస్తామని ప్రకటించిన కేంద్రం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయలేదు.