ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 23: దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో ప్రైవేటు పెట్టుబడిదారులే లబ్ధి పొందారని చెప్పారు. బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఓయూ లో ‘భారత ఆర్థిక వ్యవస్థ పయనం ఎటువైపు?’ అనే అంశంపై నిర్వహించిన సదస్సు లో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో భార త ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో ఉన్నదని, 2030 నాటికి జపాన్, జర్మనీలను దాటి మూడో స్థానానికి చేరుతుందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా కార్ల ఉత్పత్తి పెరిగిందని, ఉపాధి అవకాశాలు కల్పిస్తారనే ఉద్దేశంతో కార్పొరేట్లకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందని వివరించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింత గణేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభు త్వ రంగ సంస్థల సంక్షేమం ప్రభుత్వాలకు పట్టకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే భార త ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నదని, సహజ వనరులను అందరికీ సమపాళ్లలో పంచినపుడే న్యా యం జరుగుతుందని ఓయూ పొలిటికల్ సైన్స్ విభాగం హెడ్ ప్రొఫెసర్ చంద్రునాయక్ అభిప్రాయపడ్డారు. ఓయూలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభల నేపథ్యంలో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆం జనేయులు, శ్రీను, శర్మ, మమత, సాయికిరణ్, రాజు, పవన్కల్యాణ్ పాల్గొన్నారు.