నమస్తే తెలంగాణ నెట్వర్క్: టీఎస్పీఎస్సీలో పైసా లంచం లేదని, తాము కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించామని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు వెల్లడించారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన తాము టీఎస్పీఎస్సీ పారదర్శకత వల్లే ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు. ‘మాది సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఘంటావారిగూడెం(కల్వల్దిన్నె). మా నాన్న సాధారణ రైతు. నేను ఎంటెక్ పూర్తి చేశా. ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయటంతో దరఖాస్తు చేసుకొన్నా. విద్యుత్తు ఏఈ పరీక్షలో కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం కొల్పోయా. అయినా మానకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేశా. 2019లో పంచాయతీ సెకట్రరీ ఉద్యోగం సాధించా. ప్రస్తుతం పాలకవీడు మండలం శూన్యపహాడ్లో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నా. కొందరు స్వార్థపరుల ఆత్యాశ, ఇతర ప్రలోభాల వల్ల పేపర్ లీకైంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు అపోహాలకు గురవకుండా చిత్తశుద్ధితో చదవాలి’ అని నరేందర్ తెలిపారు.
ఒక రూపాయి ఇవ్వకుండా ఉద్యోగం
నేను టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపీడీవో ఉద్యోగం సంపాదించా. టీఎస్పీఎస్సీ చేసిన సంస్కరణల కారణంగానే నేను ఇంటి దగ్గర కూర్చోనే ఓటీఆర్ దరఖాస్తు చేశా. అన్నీ ఆన్లైన్లో చేసుకొనే వెసులుబాటు తీసుకొచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గొప్ప సంస్కరణలు అమలు చేశారు. ఒకరిద్దరు చేసిన తప్పును వ్యవస్థకు అంటగట్టడం తప్పు. నాకు 250 మంది గ్రూప్ వన్ ఉద్యోగులు తెలుసు. వారంతా ఎక్కడా ఎవ్వరికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు.
– మల్లికార్జున, ఎంపీడీవో
మా ఇంట్లో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు
పైరవీలు, బంధుప్రీతి, అవినీతి అక్రమాలకు తావులేకుండా టీఎస్పీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. అందువల్లే మా కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. మా కుమారుడు జంపాల అరుణ్కు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది. కోడలు మమత గ్రూప్-2కు ఎంపికై ఎంపీడీవో ఉద్యోగం సాధించింది. ప్రతిభను బట్టే ఉద్యోగాలు వచ్చాయి. ఇటీవల చేపట్టిన గ్రూప్-1 సైతం రాశారు. ఇద్దరు క్వాలిఫై అయ్యారు. ప్రస్తుతం పేపర్ లీక్ అయిందని పరీక్షలను రద్దు చేశారు. తిరిగి రాసేందుకు ప్రిపేర్ అవుతున్నారు.
– జంపాల రవీందర్ -మంజుల, సీపీఐ ములుగు జిల్లా సహాయ కార్యదర్శి