వనపర్తి : చదువుకు మించిన సాధనం ప్రపంచంలో మరేది లేదు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గోపాల్పేట మండలం బుద్దారం సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాలలో మల్టీ జోన్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
జ్ఞానం అర్జించడానికి చదువు గొప్ప ఆయుధం.
దీనిని నిరూపించిన భారతీయుడు, విశ్వ మానవుడు అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇందుకు నిదర్శనం అన్నారు. అంబేద్కర్ అననుకూల పరిస్థితుల్లో ఏ వసతులు లేని సమయంలో బాల్యం నుంచి విద్య పూర్తయ్యే వరకు అనేక కష్టాలు పడి బరోడా మహరాజు సహాయంతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించారు.
ప్రపంచంలో అతి కొద్ది మంది సాంఘిక, ఆర్థిక, రాజకీయ మేధావులలో అంబేద్కర్ ఒకరు కావడానికి కారణం చదువు. అందుకే చదువును ఎవరు నిర్లక్ష్యం చేయకూడదన్నారు. చదువు కునే సమయంలో సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన సూచించారు. చదువు అంటే పరిశీలన..చదువు అంటే అర్థం చేసుకోవడం.. చదువు అంటే వినడం..చదువు అంటే ఆలోచించడం..
తరగతి గదిలో వినడం ..రాసుకోవడం మాత్రమే చదువు కాదు. నిత్యం ఏది మాట్లాడినా.. ఏది విన్నా.. ఎవరితో సంభాషించినా మీ మనసు, మెదడు విషయాన్ని సానుకూల దృక్పథంతో అర్థంవచేసుకునే తపనతో పనిచేయాలన్నారు.
దానివల్లనే మీరు గొప్ప వాళ్లు అవుతారని మంత్రి పేర్కొన్నారు. ఆటల్లో గెలవడం ముఖ్యం కాదు ఆటలలో పాల్గొనడం అన్నింటికన్నా ముఖ్యం అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.