(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): వరదలు, కరువు కాటకాల వంటి ప్రకృతి సంక్షోభాలు ఒకవైపు.. తీసుకొన్న అప్పు మరోవైపు.. వెరసి రైతన్న దిక్కుతోచని స్థితికి వెళ్లిపోతున్నాడు. అయితే, అన్నదాతను ఆదుకోవాల్సిన కేంద్రప్రభుత్వం వేడుక చూస్తున్నది. బడ్జెట్లో వ్యవసాయరంగానికి కేటాయించిన నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయట్లేదు. మెజారిటీ నిధులను తిరిగి ఖజానాకే మళ్లిస్తున్నది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ తాజా గణాంకాల్లో తేలింది. ఇలా గడిచిన ఐదేండ్లలో సాగుకు కేటాయించిన నిధుల్లో రూ. లక్ష కోట్లకు పైగా నిధులు కేంద్ర ఖజానాకే తిరిగి చేరినట్టు తేటతెల్లమైంది.
ఆర్థిక సంవత్సరం : ఖజానాకు మళ్లిన నిధులు (రూ. కోట్లలో)
2018-19 : 21,043.75
2019-20 : 34,517.7
2020-21 : 23,824.53
2021-22 : 5,152.6
2022-23 : 21,005.13