హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన అనుమతులు, ప్రాజెక్టుల వంటివి సాధించడంలో ఎంపీలు కీలక పాత్ర పోషిస్తుంటారు. అవసరాన్ని బట్టి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడమో, పార్లమెంట్లో ప్రశ్నించడమో, కేంద్రంపై పోరాడటమో చేస్తారు. కానీ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరఫున 12 మంది ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి లోక్సభలో 8 మంది, రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉ న్నారు. లోక్సభ ఎంపీల్లో మల్లు రవి, బలరామ్నాయక్, సురేశ్ షెటార్ వంటి సీనియర్లు, చామల కిరణ్కుమార్, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, కుందూరు రఘువీర్రెడ్డి, రామసహాయం రఘురామిరెడ్డి వంటి తొలిసారి ఎంపికైనవారు ఉన్నారు.
రాజ్యసభకు రాష్ట్రం నుంచి అభిషేక్ మనుసింఘ్వీ, రేణుకా చౌదరి, అనిల్కుమార్, వేం నరేందర్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో వేం నరేందర్రెడ్డి ఇటీవలే రాజ్యసభలోకి అడుగుపెట్టారు. ఆయన పోను మిగతా 11 మంది ఎంపీలు ఉభయ సభల్లో మౌనంగానే ఉంటున్నారని కాంగ్రెస్ వర్గాలే ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమై ఉండి కూడా కాంగ్రెస్ సభ్యులు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అంశాలు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఏడాదికాలంగా వీటి పై కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు నోరు మెదపటం లేదన్న విమర్శలు వస్తున్నా యి. ఏ చర్చ జరిగినా తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు సరిగా హాజరుకావడం లేదని, ఇటు రాష్ట్రంలోనూ ప్రజల మధ్య కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్లో పార్టీ నిర్వహిం చే కార్యక్రమాల్లో అప్పుడప్పుడూ రాజ్యసభ ఎంపీలు పాల్గొంటున్నారని, మిగతావారు మాత్రం ఎక్కడ ఉంటున్నారో తెలియడమే లేదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.