వనపర్తి : తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న వ్యవసాయ పథకాలు దేశమంతా అమలుకు రైతుల నుంచి డిమాండ్ పెరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి పట్టణం పెబ్బేరు రహదారిలో మూడు కోట్లతో నిర్మిస్తున్న వే సైడ్ మార్కెట్, మర్రికుంట పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు ఇచ్చి పంట కొనుగోలు చేపడితే దేశం ప్రపంచానికే ఆదర్శం అవుతుందని పేర్కొన్నారు.
పంజాబ్ మినహా కేంద్రం ఎక్కడా కొనుగోళ్లు చేయడం లేదని ఆరోపించారు. దేశంలో రైతులు పంటలు అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తెలంగాణలో కూలి పని లేక ఇబ్బందులు పడగా నేడు కూలీలు దొరకని పరిస్థితి నెలకొందని వివరించారు.రైతులు బాగుంటే గ్రామాలు బాగుంటాయనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.సూగూరు చెరువును సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
బీఆర్ఎస్లో చేరికలు
నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మగ్బూల్ , పరశురాంల ఆధ్వర్యంలో పెబ్బేరు మండలం సూగూరు తాపీ మేస్త్రీ సంఘానికి చెందిన 50 మంది మంత్రి సమక్షలంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాధాకృష్ణ, కట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.