హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): జబ్బు చేసి జబ్బ వాస్తే.. దాన్ని బలుపు అనుకున్న చందాన రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారం ఉన్నది. క్షేత్రస్థాయిలో ఏమాత్రం క్యాడ ర్ లేదు.. ఉన్న బలం కూడా పట్టణ ప్రాంతా ల్లో.. అదీ కొన్నిచోట్ల మాత్రమే. ఇక రాష్ట్రంలో రెండంకెల స్థానాలను గెలుచుకున్న సీన్ అసలెన్నడూ లేదు. అనేక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకునే దిక్కు కూడా లేని దైన్యం ఆ పార్టీది! కానీ.. అక్కడక్కడ అభ్యర్థులకు ఉన్న కాస్తో కూస్తో చరిష్మాతోనో, సెంటిమెంట్ రాజకీయాలు రెచ్చగొట్టడంతోనో లేదంటే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు బరితెగించడం ద్వారా ఓటింగ్ను ప్రభావితం చేసి, దొడ్డిదోవన గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే.. అలా సాధించిన విజయాలను తన ఘనతగా చెప్పుకొం టూ తన ఖాతాలో వేసుకోవడం బీజేపీకి పరిపాటిగా మారింది. వాటిని చూపి.. ఇక రాబోయే కాలానికి తామే ప్రత్యామ్నాయం అని ‘రాజు వెడలె..’ అంటూ ఫేక్ సినిమాను జనానికి చూపిస్తున్నది. కానీ వాస్తవాలు.. ముట్టుకుంటే చేతులు కాలేలా ఉంటాయి. ఆ వాస్తవాలను బీజేపీకి గుర్తు చేస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారు.
రెండు పర్యాయాలు అధికారంలో ఉండి, అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసి, జన హృదయాల్లో నిలిచిపోయింది టీఆర్ఎస్. కానీ, క్షేత్రస్థాయిలో బలమే లేక, పిపీలికంలా నిలబడిన బీజేపీ.. తానే ప్రత్యామ్నాయం అని ప్రగల్భాలు పలుకుతుండటంపై జనాల్లో సెటైర్లు పేలుతున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీ గెలిచినా.. అది పూర్తిగా ఆయాచోట్ల పార్టీ గుర్తుపై పోటీచేసిన అభ్యర్థుల వ్యక్తిగత చరిష్మానే అనేది అందరికీ తెలిసిందే. ఉదాహరణకు.. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థికి 2018లో 13% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో అనేక అసత్య ప్రచారాలతో బీజేపీ గెలుపొందినా సాధించిన ఓట్లు 38% మాత్రమే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తంగా సాధించింది 7% ఓట్లు. ఇదే ఎన్నికల్లో హుజూరాబాద్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 0.95 శాతం మాత్రమే. అయినప్పటికీ గతేడాది జరిగిన ఉప ఎన్నికలో నాడు టీఆర్ఎస్ గుర్తుపై పోటీచేసిన ఈటలనే ఈసారి బీజేపీ గుర్తుపై పోటీ చేసి 56% ఓట్లను సాధించారు. ఇవి బీజేపీ ఓట్లు కాదని ఆ పార్టీకి కూడా తెలుసు. అదీ ఇక్కడ లోపాయికారిగా కాంగ్రెస్తో కుమ్మక్కు కావడం గమనార్హం. అదే విధంగా 2018 మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 6.39శాతం ఓట్లను సాధించగా ఇటీవల ఉప ఎన్నికలో మాత్రమే 38శాతం ఓట్లను తెచ్చుకోగలిగింది. ఇవి కూడా బీజేపీ ఓట్లు కాదన్న సంగతి తెలిసిందే. కేవలం చరిష్మాతోనే అడపాదడపా బీజేపీకి విజయాలు అందాయి. అయినప్పటికీ రాష్ట్ర కాషాయ నేతలు మాత్రం ఆ ఘనత తమ పార్టీదేనని గొప్పలు చెప్పుకోవడం రాష్ట్ర ప్రజానీకానికి నవ్వు తెప్పిస్తున్నది. ప్రతిసారీ దింపుడు కల్లం ఆశలతో ఎన్నికల్లోనో, ఉప ఎన్నికల్లోనో దిగే బీజేపీ.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అంటూ ప్రకటిస్తుండటాన్ని జోక్ ఆఫ్ ది ఇయర్గా జనం చెప్పుకొంటున్నారు.