హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 4.035 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు పేర్కొన్నారు. గడిచిన ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 1.3 కోట్ల మంది ఆర్టీసీ సేవలు వినియోగించుకున్నారని చెప్పారు. ఆర్టీసీ పట్ల ప్రజలు చూపించే ఆదరాభిమానాలు సంస్థ పురోభివృద్ధికి దోహదపడుతాయని ఆకాంక్షించారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. వాణిజ్య, రవాణా ప్రయోజనాలకు వైట్-ప్లేట్ వాహనాలను ఉపయోగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. మోటర్ వాహనాల చట్టం (66) నిబంధనలను ఉల్లంఘిస్తే సెక్షన్ 192 (ఏ) కింద శిక్ష పడుతుందని హెచ్చరించారు. కొద్ది రోజులుగా నిబంధనలు ఉల్లంఘించిన 20 వాహనాలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారని తెలిపారు. వైట్ ప్లేట్ ట్యాక్సీల్లో ప్రయాణించేవారికి ఏదైనా జరిగితే ఎలాంటి బీమా వర్తించదని చెప్పారు. ప్రయాణికులు స్వీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ‘సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం చేయండి. టీఎస్ ఆర్టీసీని ఆదరించండి’ అని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
ఆర్టీసీపై షార్ట్ ఫిల్మ్కు సజ్జనార్ ఫిదా
వికారాబాద్: ‘బుల్లెట్ బండి వద్దు.. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం’ అని షార్ట్ ఫిల్మ్ తీసిన వికారాబాద్ వాసులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. వికారాబాద్కు చెందిన నాగారం ఆనంద్, సంతోష్కుమార్, కిరణ్ సందేశాత్మక టిక్టాక్, చిన్నచిన్న వీడియోలు చేస్తున్నారు. ట్రెండింగ్లో ఉన్న ‘నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేతపా’ పాటను దృష్టిలో పెట్టుకొని.. నాగారం ఆనంద్, సంతోష్ షార్ట్ వీడియో చిత్రీకరించారు. మామ.. కూతురితోపాటు బుల్లెట్ బండిని అల్లుడు చేతిలో పెడతాడు. ‘భగ్గుమంటున్న ధరలకు ఎవరు పెట్రోల్ పోస్తారు… మనం బస్సుకు పోదాం’ అని ఆయన భార్యతో చెప్పి తీసుకెళ్లే సన్నివేశంతో చేసిన వీడియో బాగా ప్రజాదరణ పొందింది. సజ్జనార్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.. ‘తక్కువ ధర, ఎక్కువ భద్రత.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, శుభప్రదం, సుఖవంతం’ అని ట్వీట్ చేశారు. ప్రత్యేకంగా ఆ వీడియో చేసిన నాగారం ఆనంద్కు ఆదివారం ఫోన్ చేసిన సజ్జనార్ మరీ అభినందనలు తెలిపారు.