హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పుట్టుకనే ద్వేషించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. రాష్ర్టాన్ని అడుగడుగునా అణగదొక్కాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రగతికి మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ బీజేపీ పాలిత రాష్ర్టాలకు అందనంత ఎత్తుకు ఎదడగం, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా మారడం కేం ద్రానికి కంటగింపుగా మారింది. అందుకే రాష్ర్టానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులను సైతం ఇవ్వకుండా వేధిస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే గ్రాంట్ల విషయంలో కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తున్నది. రాష్ర్టానికి రావాల్సిన నిధుల విషయమై సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఆర్థికశాఖ అధికారులు అనేకసార్లు ఢిల్లీ పెద్దలకు అర్జీలు పెట్టినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నివేదిక తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను కండ్లకు కడుతున్నది.
కేంద్ర గ్రాంట్లో 44% తగ్గుదల
కేంద్రం నుంచి రాష్ర్టాలకు రెండు పద్దుల రూపంలో నిధులు అందుతాయి. వాటిలో కేంద్ర పన్నుల నుంచి రాష్ర్టానికి చట్టబద్ధంగా రావాల్సిన వాటా మొదటిది. వివిధ పథకాల అమలుకు కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ రెండోది. ఈ రెండింటిలోనూ తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపేణా రూ.38,669 కోట్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేయగా.. కేంద్రం మాత్రం కంటితుడుపు చర్యగా రూ.8,619 కోట్లే విదిల్చింది. ఇది బడ్జెట్ అంచనాలో 22%, రాష్ట్ర జీఎస్డీపీలో 1% మాత్రమే. 2021-22లో రాష్ట్ర రాబడుల్లో కేంద్రం ఇచ్చిన గ్రాంట్ 7 శాతమే. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.15,471 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చింది. దీనితో పోలిస్తే 2021-22లో వచ్చిన గ్రాంట్ 44% తక్కువ.
రాబడిలో రారాజు
తెలంగాణ ఏటికేడు రాబడులను పెంచుకుంటూ ఐదేండ్లలో 30% వృద్ధిరేటును నమోదు చేసింది. 2017-18లో రూ.88,824 కోట్లుగా ఉన్న రాష్ట్ర రాబడి.. 2021-22లో రూ.1,27,468 కోట్లకు వృద్ధి చేరింది. ఇది తెలంగాణ జీఎస్డీపీలో 11.10 శాతానికి సమానం.