హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగుల జీవితాలతో కేంద్రం చెలగాటం అడుతున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో కేవలం 10 శాఖల్లోనే 10 లక్షల ఉద్యోగ ఖాళీలా? దీన్ని బట్టి అన్ని శాఖల్లో కలిపి ఇంకెన్ని లక్షల ఖాళీలు ఉన్నట్టు ? అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ఐదేండ్లలో దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను (ఖాళీలను) సంవత్సరాలవారీగా తెలియజేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయా శాఖల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలని లోక్సభలో ప్రశ్నించారు.
నామా ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయంలో సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో మార్చి 1, 2021 నాటికి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆ ఖాళీలను సమయానుకూలంగా భర్తీ చేస్తామని చెప్పారు. కేంద్రం అందజేసిన సమాచారం పూర్తిగా అసంబద్ధంగా ఉన్నదని, గతంలో ఆయా శాఖల్లో 16 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిన కేంద్రం, తీరా ఇప్పుడు పది శాఖల్లో దాదాపు 10 లక్షలేనని చెప్పటం ఏమిటని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.