యాదాద్రి జిల్లాలో నయా మోసం
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్ 5: ‘నీకు లోన్ వచ్చింది. మీ సేవలో డీడీ కడితే పైసలు నీ ఖాతాలో పడుతాయ్’ అని గుర్తుతెలియని వ్యక్తి ఓ మహిళను నమ్మించి ఆమె వద్ద డబ్బులు తీసుకొని ఉడాయించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. యా దాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామానికి చెందిన షేక్ మల్లికాబీ వద్దకు శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి బైక్పై వచ్చి మైనార్టీ స్కీం కింద లోన్ వచ్చిందని చెప్పాడు. లోన్ కావాలంటే మీ సేవలో డీడీ కట్టాలని చెప్పి నమ్మించాడు. డీడీ కోసం వంగపల్లి గ్రామంలోని మీ సేవ వద్దకు ఆమెను బండిపై తీసుకెళ్లాడు. అక్కడ డీడీకి రూ.15 వేలు కావాలని చెప్పగా.. తన వద్ద రూ.8 వేలు మాత్రమే ఉన్నాయని మల్లికాబీ చెప్పింది. కచ్చితంగా రూ.15 వేలు కావాలని, చెవి కమ్మలు ఇస్తే కుదువ పెట్టి డబ్బు తీసుకొస్తానని, లోన్ రాగానే తిరిగి తీసుకోవచ్చని నమ్మబలికాడు. దీంతో ఆ మహిళ తన వద్ద ఉన్న రూ.8 వేలతోపాటు అర్ధ తులం బంగారు కమ్మలను ఇచ్చింది. వాటిని తీసుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి ఉడాయించాడు. ఎంత సేపటికీ రాకపోవడంతో.. మోసపోయానని గ్రహించి గ్రామస్థులకు సమాచారం అందించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు యాదగిరిగుట్ట ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడు బైక్పై వచ్చినట్టు, ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఉన్నట్టు వంగపల్లి వద్ద ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డయిందన్నారు.