Power Cuts | కొండాపూర్, మే 8 : రాష్ట్రంలో నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండకూడదని, కరెంట్ కట్ చేస్తే విద్యుత్తు ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి చెప్పినా అధికారుల్లో చలనం లేకుండా పోయింది. మహానగరంలో భారీ వర్షాలు పడినా నాణ్యమైన కరెంట్ సరఫరా చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ప్రకటించారు. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు చందానగర్లో అంధకారం అలుముకున్నది. చందానగర్లోని తారానగర్ సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగలపై భారీగా చెట్లు విరిగి పడటంతో పాటు 11కేవీ విద్యుత్ పోల్స్ పడిపోయాయి. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయయ్యారు.
24 గంటలుగా కరెంట్ సరఫరా లేకపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పారు. మరికొంతమంది అసలు స్పందించలేదు. దీంతో సహనం కోల్పోయి ఆగ్రహానికి లోనైన చందానగర్వాసులు సబ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సీపీఎం నాయకుడు క్రిష్ణ కరెం ట్ కోతలపై అధికారులను ప్రశ్నించగా సిబ్బంది కొరత ఉందని చెప్పి తప్పించుకున్నారు. ఆర్టిజన్లు, లైన్మెన్ల కొరత తీవ్రంగా ఉందని దీనిపై విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చందానగర్ కాంగ్రెస్ నాయకుడు శేఖర్రెడ్డి విద్యుత్తు శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు.
చందానగర్ చెన్నారెడ్డి దవాఖాన సమీపంలోని కాలనీల్లో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సా యంత్రం వరకు కేవలం రెండు గంటలే కరెంట్ ఇచ్చారు. ఇచ్చిన 10 నిమిషాలకు మళ్లీ పోయింది. వచ్చిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో మళ్లీ అంధకారం నెలకొంది. అధికారు లు జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు తలెత్తేవి కావు. ఫిర్యాదులకు స్పందన కరువైంది.
– వెంకటేశ్వరరావు, చందానగర్