హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్, ఆగస్టు 29: హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అదృశ్యమైన మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెపై లైంగికదాడికి పాల్పడి, బండరాళ్లతో దారుణంగా దాడి చేసి చంపినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే మహి ళా కమిషన్ స్పందించింది. సుమోటో కేసుగా స్వీకరిస్తున్నట్టు కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి వెల్లడించారు. గౌలిదొడ్డి కేశవనగర్లో నివాసముండే సాంబయ్య, కాశమ్మ (38) దంపతులు. కాశమ్మ చెత్త కాగితాలు, స్క్రాప్ సేకరిస్తూ కుటుంబ పోషణలో సహకరిస్తున్నది. ఈ నెల 25న కాశమ్మ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోగా, 27న కుమార్తె గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మంగళవారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని విప్రో సర్కిల్ వద్ద ఉన్న వాసవీ నిర్మాణ సంస్థ సెల్లార్లో పోలీసులు కాశమ్మ మృతదేహాన్ని గుర్తించారు. స్క్రాప్ సేకరణ కోసం ఆ భవనంలోకి వెళ్లిన కాశమ్మపై గుర్తు తెలియని దుండగులు లైంగికదాడికి పాల్పడి, బండరాళ్లతో మోది చంపినట్టు అనుమానిస్తున్నారు. మృతురాలి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో లైంగికదాడి జరిగినట్టు భావిస్తున్నారు. బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించినట్టు కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి తెలిపారు. సమగ్ర విచారణ జరిపి ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జేమ్స్బాబు తెలిపారు.