హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటనలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు మరోసారి మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తులో వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యే కొడుకును కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నది. అటు.. పరారీలో ఉన్న ఉమేర్ఖాన్ ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకొని పూర్తి వివరాలను రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాతే ఈ కేసులో తెరవెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరున్నారనే విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కాగా, సాక్ష్యాలను తారుమారు చేసి, నిందితులను కాపాడాలన్న కుట్రకు మాజీ మేయర్ సహకరించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.
సీసీ ఫుటేజీలు పరిశీలన
పబ్లో 28న ఏం జరిగిందనే విషయంపై మరింత స్పష్టత రాబట్టడం కోసం జుబ్లీహిల్స్ పోలీసులు పబ్ లోపల, బయట ఉన్న సీసీ ఫుటేజీలను సేకరించారు. పబ్లో భారీ సంఖ్యలో యువతీ యువకులు చెట్టాపట్టాలేసుకొంటూ కేరింతలు కొడుతూ హంగామా చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. లైంగికదాడి నిందితులతో పాటు మిగతావాళ్లు ఒక చోట గుంపుగా ఉంటూ మాట్లాడుకొంటున్న దృశ్యాలు, అందులో కొందరు.. యువతులను వేధించినట్టు ఉన్న దృశ్యాలను గుర్తించారు. పబ్ బయటకు వచ్చిన తర్వాత నిందితులు, మరికొందరు కలిసి బాధితురాలితో పాటు మరో యువతిని వేధించిన దృశ్యాలను పరిశీలించారు. మాయమాటలు చెప్పి పబ్ సమీపంలోని బేకరీకి బాధితురాలిని బెంజ్ కారులో తీసుకెళ్లారు. వారితో పాటు ఇన్నోవాలో మరికొందరు బేకరీకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత బాధితురాలిని ఐదుగురు ఇన్నోవాలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డట్టు వెల్లడైంది.
పాతబస్తీ రిపోర్టర్కు నోటీసులు
బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన పాతబస్తీకి చెందిన సుభాన్ అనే వెబ్ రిపోర్టర్కు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అఘాయిత్యానికి గురైన బాధితుల వివరాలు బయటకు రావొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలున్నా, కారులోని వీడియోలను ఫేస్బుక్లో పోస్టు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలు ఎవరు తీశారు? ఎందుకు తీశారు? ఎలా బయటకు వచ్చాయనే విషయాలపై స్పష్టత వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
జూబ్లీహిల్స్ ఘటనపై నివేదికివ్వండి: రాష్ట్ర డీజీపీని కోరిన మహిళా కమిషన్
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ బాలికపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని డీజీపీని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. సోమవారం కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి డీజీపీకి లేఖ రాశారు. ఫోన్లో మాట్లాడారు. బాలికపై ఎంతమంది దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు? వారి నేపథ్యం? ఈ కేసు విచారణ పురోగతి, పోలీసులు తీసుకొన్న చర్యలు తదితర అంశాలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. బాధితురాలి కుటుంబానికి కమిషన్ అన్ని విధాలుగా అండగా ఉంటున్నదని చైర్పర్సన్ వెల్లడించారు.