హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేసిందీ ఓటర్లు స్పష్టంగా చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) ద్వారా వేసిన ఓటు తాము ఎంచుకున్న అభ్యర్థికే పడిందో లేదో ఓటర్లు నిర్ధారించుకునేందుకు ఎన్నికల సంఘం వీలుకల్పిస్తున్నది. అందులో భాగంగా ప్రతి పోలింగ్ బూత్లో ఓటరు వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ను ఏర్పాటు చేస్తున్నది. ఈవీఎంపై ఓటు వేసిన తర్వాత అది వీవీప్యాట్లో ముద్రితమై 7 సెకన్లపాటు ఆ ఓటరుకు కనిపిస్తుంది. దీంతో ఓటర్లకు ఎలాంటి అనుమానాలు, అపోహలు తలెత్తవు.
ఇలా ఒక్కో ఓటు వేసేందుకు సగటున 21 సెకన్ల సమయం పట్టవచ్చని అంచనా. దీంతో పోలింగ్ జరిగే 10 గంటల్లో గరిష్ఠంగా 1,700 మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు హైదరాబాద్లో ప్రతి 1,550 మంది ఓటర్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రతి 1,500 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో వీవీప్యాట్లోని ఓట్లను లెక్కించరు. ఈవీఎం ఓట్లను మాత్రమే లెక్కిస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఈవీఎంల ఓట్లు, వీవీ ప్యాట్ల ఓట్లు సమానంగానే ఉన్నాయో లేదో పరిశీలించేందుకు ఐదు పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. తద్వారా అభ్యర్థులు, ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తారు.