హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ జోరు కొనసాగుతున్నది. జూన్ చివరి వారం నుంచి కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం గరిష్ఠంగా 765 కేసులు వెలుగు చూశాయి. థర్డ్ వేవ్ తర్వాత గత 4 నెలల్లో ఇదే అత్యధికం. శనివారం 652 కేసులు నమోదయ్యాయి. కాగా, పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతూ 2.2 శాతానికి చేరింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 95 శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్వే ఉండటంతో ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం కనిపించడంలేదు.
దీని బారిన పడినవారంతా దాదాపు ఇంటివద్ద చికిత్సతోనే కోలుకొంటున్నారు. దీంతో చాలా కాలం నుంచి రాష్ట్రంలో ఒక్క మరణం కకూడా నమోదు కాలేదు. అయినప్పటికీ ప్రస్తుతం కొవిడ్ కేసుల పెరుగుదల ప్రారంభంకాగానే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. టెస్టుల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం రోజూ సగటున 30 వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు వ్యాక్సినేషన్ వేగాన్ని కూడా పెంచారు. ముఖ్యంగా బూస్టర్ డోస్ పంపిణీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. దీంతోపాటు కొవిడ్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు, కొవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
పాజిటివ్లు652
కోలుకొన్నవారు627
రికవరీ రేటు98.92 %
మరణాలు0
పాజిటివిటీ రేటు2%