హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): దేశంలోని సెంట్రల్ వర్సిటీల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇందుకు దరఖాస్తుల స్వీకరణకు సీయూ చయన్ పోర్టల్ను యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీయూ చయన్ ప్రత్యేకతలను వివరించడంతోపాటు పలు అనుమానాలను ఆయన నివృత్తిచేశారు. వివరాలకు అభ్యర్థులు https ://curec.samarth.ac.in పోర్టల్ను సంప్రదించాలని కోరారు.
అభ్యర్థులు ఒకే ఒక్క క్లిక్తో దేశంలోని సెంట్రల్ వర్సిటీల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పలు వర్సిటీల్లో పోస్టుల భర్తీ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అన్ని వర్సిటీలకు ఒకే ఒక్క దరఖాస్తును సమర్పిస్తే చాలు. కొత్తగా విడుదలయ్యే నోటిఫికేషన్ల సమాచారాన్ని ఆటో ఈమెయిల్ ఆప్షన్ ద్వారా పొందవచ్చు.
ఇది కేంద్రీకృత నియామక ప్రక్రియ (సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్) కాదు. సెంట్రల్ యూనివర్సిటీలే పూర్తి స్వయంప్రతిపత్తితో రిక్రూట్మెంట్ చేసుకొంటాయి. ఇదివరకు ఫ్యాకల్టీ నియామకం జరుగుతున్నట్టుగానే కొనసాగుతున్నది. అన్ని నియామకాలు సంబంధిత సెంట్రల్ వర్సిటీలే చేపడుతారు. వర్సిటీలు ప్రకటనలు విడుదల చేయడం, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించడం, దరఖాస్తుదారులను షార్ట్లిస్ట్ చేయడం, ఇంటర్వ్యూలు, ఎంపికలు, నియామకాలను ఆయా వర్సిటీలే చేపడుతాయి. సెంట్రల్ యూనివర్సిటీల ప్రయోజనం కోసమే ఈ పోర్టల్ను యూజీసీ నిర్వహిస్తుంది.