న్యూఢిల్లీ/ హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): దేశాన్ని గ్లోబల్ స్టడీ డెస్టినేషన్గా మార్చేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సన్నాహాలు చేస్తున్నది. భారత్లో ఉన్నత విద్యావకాశాల కోసం విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటును స్వాగతిస్తున్నది. గురువారం దీనికి సంబంధించిన ముసాయిదాను యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ విడుదల చేశారు. ముసాయిదాపై ఈ నెల 18లోగా ugcforeigncollaboration@ gmail. com మెయిల్లో సలహాలు, సూచనలు పం పాలని సూచించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 సిఫార్సుల మేరకు విదేశీ యూ నివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీనిద్వారా విదేశీ యూనివర్సిటీలు దేశంలో క్యాంపస్లు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.
విదేశీ విద్యను భారతదేశంలోని విద్యార్థులకు చేరువ చేయడమే యూజీసీ ఉద్దేశమని తెలిపారు. దేశంలో న్యాక్ గ్రేడ్ పొందిన భారత వర్సిటీల సమన్వయంతో వీటిని నిర్వహించనున్నట్టు తెలిపారు. వీటికి యూజీసీ గుర్తింపు ఇస్తుందని చెప్పారు. వీటి ఏర్పాటు కోసం సంస్థలు ముందుగా యూజీసీ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో అనుమతులు లభిస్తాయని చెప్పారు. ప్రవేశాలకు సంబంధించిన వివరాలు, కోర్సులు, ఫీజులకు సంబంధించి వివరాలను ప్రవేశాలకు 60 రోజుల ముందే విదేశీ యూనివర్శిటీ స్థాపించే సంస్థలు వెల్లడించాలని పేర్కొన్నారు. డిగ్రీ, డ్యూయల్ డిగ్రీలను నిర్వహించేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ముసాయిదాకు సంబంధించిన సూచనలు, సలహాలను బట్టి తుది మార్గదర్శకాలు వెల్లడిస్తామని జగదీశ్ కుమార్ పేర్కొన్నారు.