హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న నూతన న్యాయ చట్టం ప్రకారం నిర్లక్ష్యంగా వైద్యం చేసి రోగి ప్రాణాలు తీసే వైద్యసిబ్బందికి కచ్చితంగా జైలు శిక్ష పడొచ్చని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. గరిష్ఠంగా ఐదేండ్ల శిక్ష పడేలా చట్ట సవరణ జరిగిందని గుర్తు చేసింది. నూతన న్యాయ చట్టాలపై వైద్యులకు అవగాహన కల్పించాలని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ బుధవారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.
ప్రస్తుతం దేశంలో ‘ఇండియన్ పీనల్ కోడ్ 1860’ అమల్లో ఉన్నది. దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సక్ష్య అభియాన్ పేరుతో మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. గతేడాది డిసెంబర్ 25న పార్లమెంట్ వీటిని ఆమోదించింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఇవి అమల్లోకి వస్తాయి. ‘భారతీయ న్యాయ సంహిత-2023’ లోని 106 సెక్షన్ ప్రకారం డాక్టర్ అయితే ఐదేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా, ఆర్ఎంపీకి (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) రెండేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉన్నది.