హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో భాగస్వామి కావాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఈ సంగతి తెలిపారు. ఫిబ్రవరి 24-26 వరకు హైదరాబాద్ హెచ్ఐసీసీలో బయో ఏషియా సదస్సు జరుగనున్నది.
ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, పరిశోధనా సంస్థల, కంపెనీల ప్రతినిధులు, లైఫ్ సైన్సెస్ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ స్థాయి పరిశోధనా వ్యవస్థను కలిగి ఉన్న యూకే ఈ సదస్సులో భాగస్వామి కావాలని భావించింది. బయో ఏషియాలో యూకే భాగస్వామి కావడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తినాగప్పన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.