హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ఏఈ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ ఆడిటింగ్తో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను విశ్లేషిస్తున్నారు. టీఎస్పీఎస్సీ వద్ద పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రం ఉండే ప్రధాన సర్వర్, దానికి అనుసంధానమై ఉన్న సిస్టమ్స్ అన్నింటిలో ఫోరెన్సిక్ తనిఖీలు చేస్తున్నారు. దీని ద్వారా ఒక కంప్యూటర్ లాన్ను ఇతర ప్రాంతాల్లో ఎక్కడ ఏ సిస్టమ్పై ఎప్పుడు ఓపెన్ చేశారనే విషయం తెలుస్తుంది. ఈ విశ్లేషణకు ఫోరెన్సిక్ టూల్ కిట్స్ (ఎఫ్టీకే)ను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఏ కంప్యూటర్ ఎప్పుడు ఓపెన్ చేశారు? కంప్యూటర్ ఐపీ, ఇంటర్నెట్ ఐపీల ద్వారా డాటాను ఒక దగ్గరకు చేర్చి సాంకేతిక పరమైన వివరాలను సేకరిస్తున్నారు.
పేపర్ లీకేజీ ఘటనలో కమిషన్ కార్యదర్శి పీఏ ప్రవీణ్కుమార్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డాక్య, సోదరుడు రాజేశ్వర్, పేపర్ కొనుగోలు చేసిన కేతావత్ నీలేశ్ నాయక్, పత్లావత్ గోపాల్ నాయక్, కొనుగోలుదారులను పరిచయం చేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్, డబ్బు సమకూర్చిన రాజేందర్ నాయక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుకతో పాటు పేపర్ కొనుగోలు చేసినవారి ఫోన్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకొన్నారు. ప్రత్యేక సాప్ట్వేర్లతో వీరి ఫోన్లు, ల్యాప్టాప్లలో బ్యాకప్ డాటాను సేకరిస్తున్నారు. దీంతో కొన్ని నెలలుగా జరిగిన డాక్యుమెంట్, ఫొటోలు, వీడియోల బదిలీలకు సంబంధించిన సమాచారం బయటకు రానున్నది. లక్షల మంది నిరుద్యోగ యువతకు సంబంధించిన విషయం కావడంతో దీనిని హైదరాబాద్ పోలీసులు సీరియస్గా తీసుకొని, శాస్త్రీయ ఆధారాలతో పక్కా సమాచారం తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కేసు దర్యాప్తు బాధ్యతలను సిట్కు అప్పగించారు. బేగంబజార్ నుంచి కేసు బదిలీ కాగానే సీసీఎస్లో కేసు నమోదు చేయనున్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణలో కంప్యూటర్లకు సంబంధించిన పూర్తి చరిత్ర బయటకు రానున్నది. దీంతో ఏ కంప్యూటర్, ఎప్పుడు, ఎవరు ఉపయోగించారనే పూర్తి సమాచారం బయటపడనున్నది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ ఫోన్లో కొన్ని అశ్లీల ఫొటోలు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
వెరిఫికేషన్లో సహకారం
ప్రధాన నిందితుడు ప్రవీణ్ టీఎస్పీఎస్సీలో మొదట జూనియర్ అసిస్టెంట్గా వెరిఫికేషన్ విభాగంలో పనిచేశాడు. గత సంవత్సరం కార్యదర్శి పీఏగా నియమితుడయ్యాడు ఆన్లైన్లో వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొన్నవారు తమ దరఖాస్తులు తిరస్కణకు గురైనా, ఏదైనా సమస్య ఉన్నా ఇక్కడకు వచ్చి ఆరా తీస్తారు. గతంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తుల్లో చాలా మందికి అర్హత లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి. అలాంటివారు ఈ వెరిఫికేషన్ విభాగానికి వచ్చి ప్రవీణ్తో మాట్లాడారు. అర్హత లేని వారికి నకిలీ అనుభవ సర్టిఫికేట్లు, ఐడీ కార్డులు ప్రవీణ్ ఇప్పించినట్టు ఆరోపణలున్నాయి. అలా సహాయం చేసి కొందరు మహిళలతో ప్రవీణ్ స్నేహం పెంచుకొన్నాడు. అందులో ఒకరు లీకేజీ కేసులో అరెస్టయిన ఉపాధ్యాయురాలు రేణుక.