హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి: ఈవీఎం, వీవీ ప్యాట్ ధ్వంసం కేసు విషయంలో ఏపీలో వైసీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసింది. సీఈవో ఆదేశాల మేరకు పిన్నెల్లి అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఐపీసీ, ఆర్పీ, ప్రజాప్రాతినిధ్య చట్టాల కింద 10 సెక్షన్ల కింద వివిధ కేసులను నమోదు చేశారు. పిన్నెల్లిని ఈ కేసులో ఏ1గా చేర్చా రు. పరారీలో ఉన్న ఎమ్మెల్యే కోసం పోలీసులు బుధవారం ఉదయం ఆంధ్రా, తెలంగాణ పోలీసులు సంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా గాలించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారం వద్ద పోలీసుల తనిఖీల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్, మరికొంత మందిని ఆంధ్రా పోలీసులు అదుపులోకి తీసుకొని, కారును స్వాధీనం చేసుకున్నారు. వీరిని కందిలోని సీసీఎస్ పోలీస్టేషన్లో విచారించిన అనంతరం హైదరాబాద్ తరలించారు. ఎమ్మెల్యే ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ అతిథిగృహంలో ఉన్నాడని తెలియడంతో ఆంధ్రా పోలీసుల అక్కడ తనిఖీలు చేయగా, అక్కడ లేకపోవటంతో వెళ్లిపోయా రు. పోలీసుల నుంచి తప్పించుకుని హైదరాబాద్ వైపు వెళ్తున్న పిన్నెల్లిని పోలీసులు మార్గమధ్యంలో అరెస్టు చేసినట్టు తెలుస్తున్నది. పిన్నెల్లి అరెస్టును ఆంధ్రా పోలీసులు కానీ, సంగారెడ్డి జిల్లా పోలీసులు కానీ ధ్రువీకరించలేదు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచామని ఆ రాష్ట్ర డీజీపీ హరీశ్కుమార్ గుప్తా వెల్లడించారు. ముగ్గురిపై పీడీ యాక్టు, మరో ఇద్దరి బహిషరణకు సిఫార్సు చేశామని తెలిపారు. ఎన్నికల ముందు రోజు నమోదైన కేసు ల్లో 1,522 మందిని గుర్తించామని, ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో 2,790 మం దిని గుర్తించామని తెలిపారు. ఎన్నికల అనంతరం నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించామని డీజీపీ తెలిపారు. కొందరిని అరెస్టు చేశామని, మరికొందరికి 41 ఏ సీ ఆర్సీ నోటీసులు ఇచ్చామని పేరొన్నారు.