హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వీ రాజశేఖర్, టీ పెంటయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులకు జీరో సర్వీస్ ఆధారంగా బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. సెన్సెస్ విధుల్లో ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. సెన్సెస్ పూర్తయ్యాక వారు బదిలీస్థానంలో చేరేలా చూడాలని విన్నవించారు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఖాళీల జాబితాను ముందుగా ప్రకటించి.. ఆన్లైన్ విధానంలో బదిలీలు చేపట్టాలని కోరారు.