లక్ష్మీ బరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాతున్నది. ఎగువ నుంచి స్వల్ప వరద వస్తుండటంతో అధికారులు ఆచితూచి పంపింగ్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు లక్ష్మీ పంప్హౌస్ నుంచి 7 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయగా, ప్రస్తుతం 5 పంపుల ద్వారా ఎగువనున్న ఎస్సారెస్పీకి జలాలను తరలిస్తున్నారు.
రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు ఎత్తిపోతలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రాణహితలో వరద ఒక్కసారిగా పెరిగింది. బుధవారం సాయంత్రానికి 1,24,800 క్యూసెక్కుల వరద వచ్చి లక్ష్మీ బరాజ్లోకి చేరుతున్నది. ఈ నేపథ్యంలో అధికారులు 36 గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
– హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ)