తెలుగు యూనివర్సిటీ, మే 18: 2023 సంవత్సరానికి గాను తెలంగాణ సారస్వత పరిషత్ ఉత్తమ గ్రంథాలకు పురస్కారాలు, వరిష్ట పురస్కారాలను గురువారం ప్రకటించింది. పద్యగేయ కవితా విభాగంలో పెండ్యాల కిషన్శర్మ రచించిన ‘శ్రీవరదాభ్యుదయం’ పద్య కావ్య పురస్కారానికి ఎంపిక కాగా, వచన కవితా విభాగంలో హనీఫ్ రచించిన ‘నాది దుఖః వీడని దేశం’, కథానిక విభాగంలో డాక్టర్ టీ సంపత్కుమార్ రచించిన ‘నా నుంచి మన వరకు’ గ్రంథం, నవలల్లో వీశాంతి ప్రబోధ రచన ‘బతుకు సేద్యం’, సాహిత్య విమర్శలో ఆడెపు లక్ష్మీపతి రచించిన ‘దిక్చక్రం‘ పురస్కారాలకు ఎంపికైనట్టు పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య తెలిపారు.
పురస్కారం కింద ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున నగదు బహుమతితోపాటు జ్ఞాపిక శాలువాతో సత్కరించనున్నట్టు తెలిపారు. ఇతర ప్రక్రియల్లో దేవనపల్లి వీణావాణి రచించిన ‘ధరణీరుహ’, హెచ్ రమేశ్బాబు రచించిన ‘లోటస్ ఫిలిం కంపెనీ-హైదరాబాద్’ గ్రంథాలు సమాన స్థాయి పొందడం వల్ల రెండింటికీ పురస్కారాలు అందిస్తూ నగదు మొత్తాన్ని చెరిసగం అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వరిష్ట పురస్కారాలకు ఈసారి జూపాక సుభద్ర, గుడిపాటి వెంకటేశ్వర్లు, ఆశారాజు, వారాల ఆనంద్ ఎంపికైనట్టు పేర్కొన్నారు. ఈ నెల 26న సాయంత్రం పరిషత్లో జరగనున్న సభలో పురస్కారాలను అందజేయనున్నట్టు తెలిపారు.