హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిషరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సదస్సు నిర్వహించారు. రైతులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు రెవెన్యూ శాఖకు పూర్వవైభవాన్ని తీసుకురావడంపై చర్చించారు. ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సేవలందించడం ద్వారా ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. ట్రెసా ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్ మాట్లాడుతూ.. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మించాలని, కొత్త రెవెన్యూ చట్టాన్ని సవరించి భూ రికార్డుల నిర్వహణను వికేంద్రీకరించాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. రెగ్యులరైజ్ అయిన వీఆర్ఏలు, వీఆర్వోలు, ఆపరేటర్ల సమస్యల పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, మన్నె నర్సింహారెడ్డి, ట్రెసా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పడిగెల రాజ్కుమార్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, దేశ్య, నిరంజన్, శాస్త్రి, నాగమణి, కార్యదర్శులు శైలజ, వాణి, నదీంఖాన్, వెంకటేశ్వర్లు, పల్నాటి శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్వర్లు, వాణిరెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ దేశ్పాండే, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.