హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): నేరాల నియంత్రణకు వినూత్న విధానాలను అవలంబిస్తున్న తెలంగాణ పోలీస్ వ్యవస్థ మరోసారి సత్తా చాటింది. తాజాగా విడుదలైన ఇండియా జస్టిస్ రిపోర్టు-2022లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. దీంతో దేశానికి తెలంగాణ మాడల్ ఎందుకు అవసరమో మరోసారి స్పష్టమైంది. పోలీసుల పనితీరు, జైళ్ల నిర్వహణ, న్యాయవ్యవస్థ, న్యాయసహాయం, మానవ వనరులు, వైవిధ్యం, నూతన ఆవిష్కరణలు తదితర విభాగాల్లో ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి వివిధ అంశాల వారీగా రాష్ర్టాలకు ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఓవరాల్గా తెలంగాణ 3వ స్థానంలో నిలువగా.. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మాత్రం అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. 2019లో టాటా ట్రస్టుల ద్వారా ప్రారంభమైన ఐజేఆర్.. నాటి నుంచి ఏటా రాష్ర్టాల్లో సర్వే చేపట్టి, ర్యాంకింగ్స్ ఇస్తున్నది. ఐజేఆర్-2019లో 11వ స్థానంలో, 2020లో 10వ స్థానంలో కొనసాగిన తెలంగాణ పోలీస్ వ్యవస్థ.. 2022లో ఒకేసారి తొమ్మిది ర్యాంకులకు ఎగబాకి మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు బడ్జెట్ కేటాయింపులను పెంచడం, విస్తృతంగా నియామకాలు చేపట్టి ఖాళీలను తగ్గించడం, మహిళా పోలీస్ సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమించడం, పోలీసుల తలసరి ఆదాయాన్ని పెంచడం, సిబ్బంది శిక్షణ కోసం భారీగా నిధులు ఖర్చు చేయడం, పోలీస్ట్ స్టేషన్ల ఆధునీకరణ, ఉమెన్ హెల్ప్ డెస్క్ల ఏర్పాటు, పోలీస్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ర్విజర్వేషన్ల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో గస్తీని కట్టుదిట్టం చేయడం, సీసీ కెమెరాల నిర్వహణ తదితర అంశాలు తెలంగాణ పోలీసు వ్యవస్థకు నంబర్ వన్ ర్యాంకు రావడానికి దోహదం చేశాయి.
ఐజేఆర్ తాజా ర్యాంకింగ్స్లో పోలీసింగ్తోపాటు తెలంగాణ పలు విభాగాల్లో టాప్-5లో నిలిచింది. జైళ్ల నిర్వహణలో 3వ ర్యాంకును.. సత్వర న్యాయాన్ని అందిండంతోపాటు న్యాయపరంగా బాధితులకు సహాయాన్ని అందించడంలో 5వ ర్యాంకును సొంతం చేసుకున్నది. ఈ ర్యాంకింగ్స్లో తెలంగాణతోపాటు మరికొన్ని దక్షిణాది రాష్ర్టాలు కూడా హవా కొనసాగించాయి. కానీ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ మాత్రం 6వ స్థానంతో సరిపెట్టుకున్నది. ఏపీ 12వ స్థానంలో నిలిచింది.