KRMB | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ జలాలను 66ః34నిష్పత్తిలో నియోగించుకునేందుకు ఏడాది కాలపరిమితితో చేసుకున్న తాత్కాలిక ఒప్పందం ఇక చెల్లబోదని, అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఈ నీటి సంవత్సరం నుంచి 50ః50 నిష్పత్తిలోనే కృష్ణా జలాలను వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఎదుట బలమైన వాదన వినిపించింది. దీంతో ఏకీభవించిన బోర్డు ఈ అంశాన్ని కేంద్ర జల్శక్తి శాఖకు సిఫారసు చేసేందుకు అంగీకరించింది. కేఆర్ఎంబీ 17వ సమావేశం బోర్డు చైర్మన్ శివనందన్కుమార్ అధ్యక్షతన బుధవారం జలసౌధలో జరిగింది. వార్షిక బడ్జెట్తోపాటు పలు సాంకేతిక అంశాలపై తెలంగాణ, ఏపీతో చర్చించింది. ప్రధానంగా ఈ నీటి సంవత్సరం నదీ జలాల వాటా వినియోగంపైనే దాదాపు 2 గంటలపాటు చర్చ కొనసాగింది.
గతంలో చేసుకున్న తాత్కాలిక ఒప్పందం మేరకు ఈ ఏడాది కూడా 66ః34 నిష్పత్తిలోనే కృష్ణా జలాలను వినియోగించుకోవాలన్న బోర్డు చైర్మన్, ఏపీ వాదనలను తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి ఏపీ పునర్విభజన సమయంలో తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితులు, అవసరాలు పూర్తిగా విభిన్నమని వివరించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం పెండింగ్ ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ త్వరగా పూర్తిచేస్తున్నారని పేర్కొంటూ.. నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులను ఉదహరించారు. 2018 నుంచి ఆయా ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగం దాదాపు 105 టీఎంసీల మేరకు పెరిగిందని, తెలంగాణకు మొత్తంగా సుమారు 575 టీఎంసీలు అవసరమవుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇప్పటికే ట్రిబ్యునల్ ఎదుట ప్రతిపాదనలు పెట్టామని, అయినా ఇప్పటికీ తాతాలిక ఒప్పందాన్ని పొడగిస్తూ రావడం తెలంగాణకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని తెగేసి చెప్పారు. ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చేవరకూ కృష్ణా జలాలను 50ః50 నిష్పత్తిలో వినియోగించుకునేలా అనుమతివ్వాల్సిందేనని పట్టుబట్టారు. రాష్ర్టాల సమ్మతి లేకుండా ఏకపక్షంగా నీటి పంపకాలు జరిపే అధికారాలు కేఆర్ఎంబీకి లేవని స్పష్టం చేశారు.
ట్రిబ్యునల్ అవార్డు మేరకు తాగునీటికి వినియోగించుకునే నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై కూడా బోర్డు సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ట్రిబ్యునల్ అవార్డును వెంటనే అమలు చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. అందుకు ఏపీ నిరాకరించడంతోపాటు కూడా పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. తాగునీటికి వినియోగించుకునే నీటిలో 80% తిరిగి నదిలోకే వచ్చి చేరుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, దీనిపై తగిన అధ్యయనం చేశాకే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఏపీ చేసిన వాదనను రజత్కుమార్ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి అధ్యయనాలు చేసి శ్రీశైలం కుడి కాల్వకు (ఎస్ఆర్బీసీ) 11 టీఎంసీలు కేటాయించారని నిలదీశారు.
తాగునీటికి వినియోగించుకునే నీటిలో ఎక్కడయినా 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని ఆయన స్పష్టం చేయడంతో ఈ అంశంపై మరోదఫా చర్చించాలని సమావేశం నిర్ణయించింది. ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలను సైతం రజత్కుమార్ కొట్టిపడేశారు. సుంకిశాల ప్రాజెక్టు కేవలం తాగునీటి కోసం చేపట్టినదేనని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఏపీ అక్రమంగా చేపట్టిన రాయలసీమ, ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువ పనులను కూడా రజత్కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రివర్ బోర్డుల గెజిట్ ప్రకారం ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రొటోకాల్ను నిర్ధారించేందుకు గతంలో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)ని ఏర్పాటు చేయడం.. ఆ కమిటీ నివేదికలోని పలు అంశాలపై తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత బోర్డు సమావేశంలోనూ ఆర్ఎంసీపై చర్చ కొనసాగింది. బోర్డులో కొత్తగా నియమితులైన సీఈ గుప్తా ఆధ్వర్యంలో మళ్లీ ఆర్ఎంసీని కొనసాగించడంతోపాటు తెలంగాణ అభ్యంతరాలపై ప్రధానంగా చర్చించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇక శ్రీశైలం నుంచి 34 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఏపీని నిలువరిస్తేనే జలవిద్యుత్తు ఉత్పత్తి అంశంపై తెలంగాణ మాట్లాడుతుందని రజత్కుమార్ కుండబద్ధలు కొట్టి చెప్పారు.
ఈ సమావేశంలో తొలుత బోర్డు వార్షిక బడ్జెట్పై చర్చ కొనసాగింది. దాదాపు రూ.23 కోట్లతో బోర్డు చైర్మన్ ప్రతిపాదనలు పంపగా.. అందుకు ఇరు రాష్ర్టాలు ఆమోదం తెలిపాయి. అందులో తొలి విడతగా రూ.3.40 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించాయి. ఆర్డీఎస్ ఆధునీకరణపై సీడబ్ల్యూపీఆర్సీ ద్వారా 3 నెలల్లో అధ్యయనం జరిపించాలని, వచ్చే సీజన్లో మరమ్మతులు చేపట్టాలని బోర్డు నిర్ణయించింది. కృష్ణా బోర్డును త్వరలో విశాఖకు తరలిస్తామని ఏపీ తెలియజేసింది.
తెలంగాణ వాదనలతో బోర్డు చైర్మన్ ఏకీభవించారు. అయితే గతంలో కేంద్ర జల్శక్తి ఆధ్వర్యంలోనే తాత్కాలిక ఒప్పందం జరిగినందున ప్రస్తుతం కూడా ఈ అంశాన్ని కేంద్రానికి సిఫారసు చేస్తామని తెలిపారు. ఇకపై తాత్కాలిక ఒప్పందం మేరకు కాకుండా త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నదీ జలాల వినియోగం కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ర్టాల డిమాండ్లు, రిజర్వాయర్లలో నీటి నిల్వల ఆధారంగా త్రిసభ్య కమిటీ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని బోర్డు చైర్మన్ పేర్కొనడంతో తెలంగాణ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
రానున్న నీటి సంవత్సరంలో ఇరు రాష్ర్టాలు కృష్ణా జలాలను వినియోగించుకోవాల్సిన విధానాన్ని ఖరారు చేయాలని కేఆర్ఎంబీ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. బోర్డు సమావేశంలో తెలంగాణ వాదనలను బలంగా వినిపించిన అధికారులను అభినందించింది. ఎలాంటి నీటి పంపకాలు లేకుండానే ఈ సమావేశం వాయిదా పడటం, ఆ అంశాన్ని తిరిగి కేంద్ర జల్శక్తి శాఖకు బదలాయించడంలో తెలంగాణ అధికారులు కీలకపాత్ర పోషించారని సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం బుధవారం ఓ ప్రకటనలో ప్రశంసించారు. 2014లో కేవలం ఏడాది కాలానికి కుదుర్చుకున్న తాతాలిక ఒప్పందాన్ని నేటి వరకు కేఆర్ఎంబీ ఏకపక్షంగా కొనసాగించడం వల్ల తెలంగాణ ప్రాజెక్టులకు నికరజలాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో న్యాయంగా తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించేవరకు పోరాటాన్ని కొనసాగించాలని రాష్ట్ర అధికారులను కోరారు.