Exit Polls | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు మూడు నెలలుగా నెలకొన్న ఎన్నికల వాతావరణం, ప్రధాన అంకం పోలింగ్తో ముగిసింది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పుడు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ల వారీగా, సామాజిక వర్గాల వారీగా కూడికలు, తీసివేతల్లో తల మునకలయ్యారు. పోలింగ్ సరళి, ఏ వర్గం ఓటరు ఎటువైపు మొగ్గుచూపారు? అందులో తమ వాటా ఎంత? అనే విశ్లేషణలో ప్రధాన పార్టీలు లెక్కలు తీస్తున్నాయి.
అదే క్రమంలో గత ఎన్నికల్లో పార్టీ బలాబలాలు, ఓటింగ్ శాతంతో పోలిస్తే ప్రస్తుతం వీచిందని చెప్తున్న గాలిలో నిజమెంత? వ్యక్తిగత అభిప్రాయాలు సామూహిక వాస్తవాలను ఎగ్జిట్పోల్స్ ఏ మాత్రం అంచనా వేశాయి? ఓటరు నాడిని అవి ఎంతవరకు పట్టుకున్నాయి? అన్నది మరో రోజు గడిస్తే కానీ తెలియదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకుంటే ఎంతగాలి వీచినా గతంలో వచ్చిన మెజారిటీలు తగ్గిపోయినా సీటు గ్యారెంటీ అనుకునే నియోజకవర్గాలేమిటన్న అంశం రాజకీయ విశ్లేషకులు దృష్టి సారించారు.
గత ఎన్నికల్లో 20 వేల నుంచి లక్షకు పైగా మెజారిటీ వచ్చిన నియోజకవర్గాలు 69 ఉన్నాయి. అందులో 61 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 88 నియోజకవర్గాల్లో 61 మంది ఎమ్మెల్యేలకు 20 వేల నుంచి లక్షకు పైగా మెజారిటీలు వచ్చినవి ఉన్నాయి. ఎంఐఎం 5 నియోజకవర్గాలు, కాంగ్రెస్ పార్టీకి రెండు చోట్ల మాత్రమే 20 వేల పైచిలుకు మెజారిటీ రావడం గమనార్హం. అయితే ప్రస్తుతం బయట వీస్తున్న గాలి.. లేదా వీచిన గాలి అని చెప్పుకున్నది నిజమేనని అనుకున్నా మెజారిటీ తగ్గుతుందే తప్ప బీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్నంత కసి ప్రజల్లో లేదని రాజకీయ విశ్లేషకులుఅభిప్రాయపడుతున్నారు. ఇండియా టుడే సర్వేనే అందుకు నిదర్శనంగా చూపుతున్నారు.
ఇండియా టుడే సర్వేలో 32 శాతం రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మరోసారి సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారని, ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో రేవంత్రెడ్డికి 21 శాతం, తక్కిన నేతలు ఎవరైనా ఫర్వాలేదని 22 శాతం చెప్తున్నారని తేలింది. అంటే కచ్చితంగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాకు ఇది సంకేతమని చెప్తున్నారు. పైపెచ్చు ఉమ్మడి రాష్ట్రం నుంచి 2014, 2018 దాకా ఎన్నికల చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఏనాడూ 50 సీట్లకు మించి పెరగలేదని అంటున్నారు.
మంత్రులు కేటీఆర్, హరీశ్రావుసహా అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులు, మరికొంత మంది ముఖ్యనాయకులు శుక్రవారం సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో పోలింగ్ సరళి తదితర అంశాలను లోతుగా విశ్లేషించినట్టు తెలిసింది. ‘మళ్లీ మనమే గెలుస్తున్నాం. ప్రజలు మనకే స్పష్టమైన అధికారం ఇవ్వబోతున్నారు’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని సమాచారం.
పోలింగ్ అనంతరం వెల్లడైన ఎగ్జిట్పోల్స్, ఇండియా టుడే వంటి జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన సర్వేల్లో నిజమెంత? అనే ఉత్కంఠలో రాజకీయ పార్టీలున్నాయి. ఎగ్జిట్పోల్స్ ఎగ్జాట్పోల్స్ సర్వేలుగా ఉంటాయని, ఆ ఫలితాలే నిజం అవుతాయని చెప్పటానికి వీల్లేదని రాజకీయ పండితులు అంటున్నారు. గతంలో అనేక ఎన్నికల సందర్భంగా అలాగే జరిగిందని ఉదహరిస్తున్నారు. 2018లో ఒకటి రెండు మినహా తక్కిన సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీ విషయంలో బొక్కబొర్లా పడ్డాయి.