హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ‘బాస్ స్కామ్’లు దడ పుట్టిస్తున్నాయని, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం డీజీ శిఖాగోయెల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఐ4సీ నివేదికల ప్రకారం 20 రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఈ తరహా మోసాలపై 300కుపైగా ఫిర్యాదులు నమోదైనట్టు పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు సీనియర్ అధికారుల డీపీలు పెట్టి, కంపెనీల అధిపతుల పేర్లను వాడుకుంటూ ఉద్యోగులకు ఈ మెయిల్స్ లేదా వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతారని తెలిపారు. ZIP లేదా RAR ఫైళ్లను ఓపెన్ చేయొద్దని, ‘Urgent Compliance’ లేదా ‘Immediate Action Required’ అనే మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు. అనుమానాస్పద సందేశాలు వస్తే.. వెంటనే సంస్థలోని ఐటీ, భద్రతా విభాగానికి సమాచారం అందించాలన్నారు.