హైదరాబాద్, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ): వచ్చే 2024-25 సంవత్సరంలో లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సాగు ప్రణాళికను రూపొందించింది. దీనిలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 13 వేల ఎకరాల్లో, అత్యల్పంగా కుమ్రంభీం-ఆసిఫాబాద్ జిల్లాలో 400 ఎకరాల్లో సాగుకు లక్ష్యాన్ని నిర్దేశించింది.
కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయిల్పామ్ సాగు పెంపుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చొరవ చూపుతున్నారు. తద్వారా రైతులు లాభదాయకమైన పంటల వైపు మళ్లి లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఆయిల్పామ్ అంతంత మాత్రంగానే సాగవుతున్నది.
2 లక్షల ఎకరాల్లో సాగు ల క్ష్యాన్ని నిర్ణయించగా, ఇప్పటివరకు కేవలం 56 వేల ఎకరాల్లో మాత్రమే సాగైనట్టు అధికారులు తెలిపారు. సాగుపై ఎన్నికల ప్ర భావం పడినట్టు వారు తెలిపారు. ఎన్నికల సమయంలో అధికారులంతా ఎన్నికల విధు ల్లో ఉండటంతో రైతులను ఆయిల్పామ్ సా గు వైపు మళ్లించడంలో జాప్యం జరిగింది.
ఈ ఏడాది ధాన్యానికి మంచి ధర పలకడంతో ఆయిల్పామ్ సాగుకు సిద్ధమైన రైతులు ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఈ ఏడాది మరో రెండు నెలల గడువు ఉండటంతో మరో నాలుగైదు వేల ఎకరాల్లో సాగువిస్తీర్ణం పెరిగి నా 60 వేల ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. నిరుడు రికార్డు స్థాయిలో 85 వేల ఎకరాల్లో సాగు కావడం విశేషం.
సాగుపై వర్షాభావ ప్రభావం
వచ్చే ఏడాది (2024-25) కూడా ఆయిల్పామ్ సాగు అంతంత మాత్రంగానే ఉంటుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు తగ్గితే ఆ ప్రభావం ఆయిల్పామ్ సాగుపై ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాదంతా ఎన్నికలు కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు.
అధిక సాగు విస్తీర్ణం గల జిల్లాల వివరాలు
జిల్లా : సాగు లక్ష్యం
ఖమ్మం : 13,000
కొత్తగూడెం : 11,000
నల్లగొండ : 6,700
మహబూబాబాద్ : 5,000
సిద్దిపేట : 4,800
సూర్యాపేట : 4,800
నిర్మల్ : 4,200
జగిత్యాల : 3,850
వరంగల్ : 3,800
యాదాద్రి : 3,500
జనగాం : 3,400
నాగర్కర్నూల్ : 3,000