TS EAMCET | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్లో సిలబస్ను తగ్గించారు. మేలో నిర్వహించే ఈ ఎంట్రెన్స్లో ఫస్టియర్ నుంచి 70 శాతం, సెకండియర్లో 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలొస్తాయి. ఈ మేరకు సిలబస్ను ఎంసెట్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థమే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం విడుదలైన ఎంసెట్ షెడ్యూల్ ప్రకారం మార్చి 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్నది. తగ్గించిన సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వబోమని, ఇచ్చిన పాఠ్యాంశాల నుంచే ప్రశ్నలొస్తాయని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్ తెలిపారు. కరోనాతో నిరుడు ఎంసెట్లో ఫస్టియర్, సెకండియర్ సిలబస్లో 70 శాతం మేరకే ప్రశ్నలిచ్చారు. తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఫస్టియర్ సిలబస్లో 30శాతం తగ్గించి, సెకండియర్లో పూర్తి సిలబస్ను అమలు చేయనున్నట్టు డీన్కుమార్ వెల్లడించారు. మంగళవారం విడుదలయ్యే నోటిఫికేషన్లో సిలబస్ను పొందుపరుస్తామని ఆయన తెలిపారు.