యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ మాదిగలను నిలువునా ముంచిందని, మాదిగ జాతి కోసం ఆ పార్టీని తరిమికొడదామని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ జిల్లా చండూరులో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. కమలానికి ఓటేస్తే కులం కూలుతుందన్నారు. మాదిగ జాతికోసం బీజేపీని బొంద పెట్టాలని, అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఎనిమిదేండ్లు అయినా అమలు చేయలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ దళితబంధుతో దళితులను పారిశ్రామికవేత్తలుగా, గౌరవంగా బతికేలా చేస్తున్నారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.