హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీవోఏ)కు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొనేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, యూనిట్లు, డిప్యుటేషన్ సంస్థల్లో అసోసియేషన్ ఎన్నికలు ప్రభుత్వ జీవో నం.539 (1979), జీవో నం.113 (2008)లో పేరొన్న నిబంధనల మేరకు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ప్రతి మూడేండ్లకోసారి జిల్లా, యూనిట్ కమిటీల ఎన్నికలు నిర్వహించాలి. ఈ నేపథ్యంలో 2026 ఆగస్టు నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి, 2026 సెప్టెంబర్ 30 నాటికి పూర్తిచేయాలని డీజీపీ ఆదేశించారు.
ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను 2026 నవంబర్ తొలి వారంలో నిర్వహించనున్నట్టు పేరొన్నారు. జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, యూనిట్లలో అధ్యక్షుడు-1, ఉపాధ్యక్షులు-2, కార్యదర్శి-1, జాయింట్ సెక్రటరీ-1, ఆర్గనైజింగ్ సెక్రటరీ-1, కోశాధికారి-1, యూనిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు-6 చొప్పున ఉంటారు. సివిల్, ఆర్మ్డ్ విభాగాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా పోస్టుల కేటాయింపు ఉండాలని ఆ ఆదేశాల్లో పేరొన్నారు.
ముఖ్యంగా మహిళా పోలీసులకూ ప్రాతినిధ్యం కల్పించాలని డీజీపీ ఆదేశించారు. దీంతో జిల్లా ఈసీ కమిటీ సభ్యుల్లో ఒక పదవిని కచ్చితంగా మహిళా పోలీసులకు కేటాయించాల్సి ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి, ఫ్యూచర్ సిటీ పరిధిలోని లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్, ఎస్బీ, ఉమెన్ పోలీస్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగాలకు ప్రత్యేక పోస్టుల సంఖ్యతో కూడిన కమిటీలను నోటిఫికేషన్లో పొందుపరిచారు.