హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): మన జీవన విధానమే ఆయుష్షును నిర్ణయిస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆరోగ్యం దెబ్బతింటే తిరిగి పొందలేమని, ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. శనివారం హైదరాబాద్లో ఐడియా క్లినిక్స్ (ఇన్స్టిట్యూట్ ఫర్ డయాబెటిస్ ఎండోక్రైనాలజీ అండ్ అడిపోసిటీ) ఆధ్వర్యంలో ‘డయాబెటిక్స్ అండ్ ఎండో క్రైనాలజీ రీసెర్చ్ అప్డేట్-2022’ నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు లో మంత్రి హరీశ్రావు మాట్లాడారు.
బీపీ, షుగర్ వంటి వ్యాధులను త్వరగా గుర్తించి, మందులు వాడితే మంచి ఫలితాలు ఉం టాయని చెప్పారు. ఇలాంటి సమావేశాల వల్ల మధుమేహ చికిత్సలో వస్తున్న నూతన మార్పులు, టెక్నాలజీ గురించి తెలుసుకోవచ్చన్నారు. జీవన శైలి, ఆహారపు అలవాట్లు మారడంతో చిన్నవయసులోనే బీపీ, షుగర్ వస్తున్నాయని, నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (అసాంక్రమిక వ్యాధులు)ను నియంత్రించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నారని చెప్పారు.
మూడంచెల అరోగ్య వ్యవస్థను 5 అంచెలకు అభివృద్ధి చేస్తున్నారని, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తున్నారని తెలిపారు. తద్వారా దేశంలో రికార్డు సాధించడంతోపాటు ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెద్ద సంఖ్యలో పెరుగనున్నాయన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో 1.34 కోట్ల మందికి ఎన్సీడీ స్క్రీనింగ్ చేశామని, ఈ అంశంలో దేశంలోనే టాప్లో ఉన్నామని తెలిపారు.