హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 9 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అదర్ డ్యూటీ(ఓడీ) సౌకర్యం కల్పించింది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (రాష్ట్రస్థాయి)లో శాశ్వత సభ్యత్వం కలిగిన సంఘాలకు ఓడీ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2026 క్యాలెండర్ సంవత్సరం మొత్తానికి ఈ సౌకర్యం వర్తిస్తుందని వెల్లడించింది.
టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూ టీఎస్, ఎస్టీయూ టీఎస్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్(ట్రెసా), తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, టీఎస్ యూటీఎఫ్, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ సంఘాల అధ్యక్షప్రధాన కార్యదర్శులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ అసోసియేషన్ అధ్యక్షుడికి ఓడీ సౌకర్యం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.