HomeTelanganaThe State Government Intends To Appoint New Vice Chancellors Vc For The Universities Of The State As Soon As Possible
త్వరలో కొత్త వీసీల నియామకం
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నూతన వైస్చాన్స్లర్లను (వీసీ) వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. పాత వీసీలు అలా వైదొలగగానే.. కొత్త వీసీలు బాధ్యతలు చేపట్టేలా ముందుకెళ్తున్నది.
కసరత్తు ప్రారంభించనున్న ప్రభుత్వం
త్వరలోనే సెర్చ్ కమిటీల ఏర్పాటు
ఆ తర్వాత అమల్లోకి నియామకాలు
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నూతన వైస్చాన్స్లర్లను (వీసీ) వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. పాత వీసీలు అలా వైదొలగగానే.. కొత్త వీసీలు బాధ్యతలు చేపట్టేలా ముందుకెళ్తున్నది. త్వరలోనే కొత్త వీసీల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నది. ఇందుకోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నది. రాష్ట్రంలో 16 వర్సిటీలు ఉన్నాయి. వీటిలో బీఆర్అంబేద్కర్, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, పొట్టి శ్రీరాములు తెలుగు, మహత్మాగాంధీ, జేఎన్టీయూ, జేఎన్ఎఫ్ఏయూ వర్సిటీల వీసీల పదవీ కాలం ఈ ఏడాది మేతో ముగుస్తుంది. ఆర్జీయూకేటీ, ఫారెస్ట్, మహిళా వర్సిటీలకు వీసీలను ఇంత వరకు నియమించలేదు. అగ్రికల్చర్ వర్సిటీకి ఇన్చార్జ్ వీసీ కొసాగుతున్నారు. ఇక హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీల వీసీల పదవీ కాలం జనవరితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో వీసీల నియామక కసరత్తును ప్రారంభించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలిచ్చింది.
వీసీల కాలపరిమితిపై సీఎం ఆరా
కొత్త వీసీల నియామకానికి త్వరలోనే సెర్చ్ కమిటీలను నియమించే అవకాశాలున్నాయి. శనివారం విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి వీసీల కాలపరిమితిపై ఆరా తీసినట్టు తెలిసింది. వీసీల పదవీకాలం ముగిసిన మరుసటి రోజే కొత్త వీసీలు బాధ్యతలు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చినట్టు సమచారం. విద్యాశాఖపై వారం పది రోజులకోసారి సమీక్షిస్తానని సీఎం చెప్పినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. తొలుత వీసీలను నియమించేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీలను ఏర్పాట్లు చేస్తుంది. ఈ కమిటీలో యూజీసీ నామిని, వర్సిటీ పాలకమండలి నుంచి ఒకరు, రాష్ట్రప్రభుత్వ నామినిగా ఒకరు ఉంటారు. ఈ కమిటీ దరఖాస్తులను ఆహ్వానించి వీసీ నియామక ప్రక్రియను చేపడుతుంది. ఈ ప్రక్రియంతా మేలోగా ముగియాలని, పాత వారు వైదొలిగేలోపే కొత్త వీసీలను నియమించాలని సీఎం అభిప్రాయపడ్డట్టు అధికారులు తెలిపారు.
వీటికి సాధ్యమయ్యేనా..
రాష్ట్రంలోని మూడు వర్సిటీలకు వీసీలను నియమించడం సాధ్యమేనా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బాసరలోని ఆర్జీయూకేటీకి ప్రభుత్వం మొదట చాన్స్లర్ను నియమించాల్సి ఉంటుంది. గవర్నర్ లేదా విద్యావేత్తను చాన్స్లర్గా నియమించిన తర్వాతే వీసీని నియమించే అవకాశమున్నది. అటవీ విశ్వవిద్యాలయం, తెలంగాణ మహిళా వర్సిటీలు ఏర్పాటు కాగా, వీటి వర్సిటీ యాక్ట్ను అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందుకు కొంత సమయం పట్టే అవకాశాలున్నాయి.