హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆన్లైన్ ద్వారా ఈ పథకం పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పోర్టల్ను 20 రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. దళితబంధు పథకం అమలుకు తొలుత హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఆ నియోజకవర్గంలో అర్హులైన మొత్తం 18,021 మంది దళితులకు రూ.10 లక్షల చొప్పున అందజేసింది. అనంతరం వాసాలమర్రి గ్రామంతోపాటు చింతకాని, చారుగొండ, నిజాంసాగర్, తిరుమలగిరి మండలాల్లో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో తొలి విడతగా 100 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 38,012 మంది అర్హులను గుర్తించి నిధులను మంజూరు చేసింది. వారికి సంబంధించిన దాదాపు 37 వేల యూనిట్లు గ్రౌండింగ్ పూర్తయి విజయవంతంగా దూసుకుపోతున్నాయి. దీంతో త్వరలో రెండో విడత దళితబంధును ప్రారంభించి మరింత పక్కాగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందులో భాగంగానే ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నది.
దళితబంధు పథకానికి సంబంధించిన సమగ్ర వివరాలను ఈ పోర్టల్లో పొందుపరచనున్నారు. అన్ని గ్రామాల్లోని దళితబంధు లబ్ధిదారుల వివరాలు, వారు ఎంచుకున్న యూనిట్లు, వాటిని ఎప్పుడు ప్రారంభించారు? పురోగతి ఎలా ఉన్నది? తదితర వివరాలతోపాటు లబ్ధిదారుల విజయ గాథలను ఆన్లైన్లో పొందుపర్చి, ప్రచారం చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు దళితబంధు పథకం అమలు కోసం క్షేత్రస్థాయిలో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. ఆ అధికారుల ఫోన్ నంబర్లను కూడా పోర్టల్లో పొందుపరచనున్నారు. దళితబంధు నిధుల మంజూరు మొదలుకొని యూనిట్ల గ్రౌండింగ్ వరకు ప్రతి అంశంపై ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ కొనసాగించేందుకు వీలయ్యేలా ఈ పోర్టల్ను తీర్చిదిద్దుతున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో క్షేత్రస్థాయిలో దళితబంధు అమలు తీరును ఉన్నతాధికారులు నేరుగా తమ కార్యాలయం నుంచే నిరంతరం పర్యవేక్షించే వెసులుబాటు కలుగనున్నది.