హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 3,686 పంచాయతీలకు సొంత భవనాలను మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20 లక్షల చొప్పున, మొత్తంగా రూ.737 కోట్ల వరకు ఖర్చు చేయనున్నది. గ్రామ పంచాయతీలకు ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున భవనాలను మంజూరు చేయడం ఇదే ప్రథమమని పంచాయతీరాజ్శాఖ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలు మార్చారు.
ఆయా పంచాయతీలకు గిరిజనులే సర్పంచ్లుగా ఉన్నారు. కొత్త భవనాల మంజూరులో ఎస్టీ పంచాయతీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. 1,211 ఎస్టీ పంచాయతీలకు నిధులు మంజూరు చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశాలు నిర్వహించుకోవడానికి, రికార్డులను భద్రపర్చుకోవడం, గ్రామ సభలు నిర్వహించుకోవడం తదితర అవసరాల కోసం గ్రామ పంచాయతీ భవనాలు అవసరం. కొన్ని పంచాయతీల్లో భవనాలు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. మరికొన్ని పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం శాశ్వత భవనాలను మంజూరు చేసింది.