హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలో లష్కర్లు, హెల్పర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సర్వీస్ రూల్స్ను జారీ చేసింది. తెలంగాణ ఇరిగేషన్ ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (అన్స్కిల్డ్) సబార్డినేట్ సర్వీస్ రూల్స్- 2023 పేరిట నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేసింది.
తెలంగాణ ప్రభు త్వం ఇటీవలే 20 వేల మందికిపైగా వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడంతోపాటు విద్యార్హతలను బట్టి వారిని వివిధ శాఖల్లో నియమించింది. కనీస విద్యార్హత కలిగిన 5,073 మంది వీఆర్ఏలను సాగునీటిశాఖకు కేటాయించింది. వారిలో 3,905 మందిని లష్కర్లుగా, 1,168 మందిని హెల్పర్లుగా నియమించాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే 33 జిల్లాల వారీగా, 19 టెరిటోరియల్ వారీగా కేటాయింపు పూర్తి చేసింది. లష్కర్లు, హెల్పర్లకు వేర్వేరుగా సర్వీస్ రూల్స్ను రూపొందించి నోటిఫికేషన్ను జారీ చేసింది. టెరిటోరియల్ చీఫ్ ఇంజినీర్ల పరిధిలో వీరు పనిచేయాలి.