హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): పాఠశాల స్థాయిలోనే బాలలకు చెత్త సేకరణ, వినియోగంపై అవగాహన కల్పించడానికి నగరాలు, పట్టణాల్లో ‘స్వచ్ఛ బడి’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలో ఒక కేంద్రం చొప్పున ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. స్వచ్ఛ బడిలో భాగంగా హోం కంపోస్టింగ్ యూనిట్, కమ్యూనిటీ కంపోస్టింగ్ యూనిట్, ట్రైనింగ్ హాల్, ట్రిపుల్ ఆర్ సెంటర్, అర్బన్ ఫామింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
దీనికోసం ఒక్కో కేంద్రానికి రూ.55 లక్షల చొప్పున మున్సిపల్ శాఖ నిధులను విడుదల చేసింది. నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలకు, రాష్ట్ర స్థాయి నిర్వహణ కోసం రూ.79.60 కోట్లు వెచ్చించనున్నారు. ప్రతిరోజు కనీసం 50 మంది విద్యార్థుల చొప్పున అవగాహన కల్పించనున్నారు. చెత్త సేకరణ, తడి, పొడి చెత్త, కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.
ఆయా విషయాలను తరగతి గదుల్లో కాకుండా ప్రాక్టికల్గా చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ బడిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ బడి విజయవంతంగా కొనసాగుతుండటంతో రాష్ట్రమంతటా విస్తరించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. సిద్దిపేటలో స్వచ్ఛబడి విజయవంతం కోసం తుమ్మల శాంతిని కన్సల్టెంట్గా నియమించారు.