హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారి లైసెన్స్ గడువును మూడేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచింది. దీనితోపాటు లైసెన్స్ రుసుమును భారీగా తగ్గించింది. ఈ మేరకు ఈ నెల 9న జీవో 22ను జారీ చేసింది. ఇది ఆ రోజు నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లోని కాంట్రాక్టర్లకు ఎంతో ప్రయోజనం చేకూరింది.
ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డితోపాటు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుకు తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. వారిలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ శివకుమార్, ఎస్కే మాజిద్ అహ్మద్, లైసెన్సింగ్ బోర్డు సభ్యులు పీ సదానంద్, ఎన్ పర్వతాలు ఉన్నారు. దేశంలో విద్యుత్తు కాంట్రాక్టర్ల లైసెన్స్ గడువును ఐదేండ్లకు పెంచిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వారు పేర్కొన్నారు.