హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. సోమవారం నుంచి ఈ నెల 17 వరకు డ్రైవ్ కొనసాగుతుందని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ను ఈ నెల 1న ప్రారంభించింది. మొత్తం 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, 9 రోజుల్లోగా పరిష్కరిస్తామని ప్రకటించింది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఏమిటి? దరఖాస్తుల పరిశీలనకు ఎంత సమయం పడుతుంది? వంటి వివరాలేవీ తెలుసుకోకుండా కేవలం ఎలక్షన్ స్టంట్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం వల్లే అభాసుపాలైనట్టు ప్రభుత్వం గుర్తించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయటంతోపాటు తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవాలని ఆరాటపడిందనే విమర్శలు ఉన్నాయి. 10వ తేదీనాటికి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుందని, ఆ తర్వాత 2, 3 నెలలపాటు ప్రజలు మర్చిపోతారని ప్రభుత్వం భావించింది. కానీ పథకం రివర్స్ అయ్యింది. ఎన్నికల కోడ్ రాకపోగా.. దరఖాస్తుల పరిశీలన ప్రహసనంగా మారింది. 9 రోజుల్లో కనీసం ఎన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యాయో చెప్పుకోలేని దుస్థితికి చేరింది. ఈ నేపథ్యంలో డ్రైవ్ను మరో వారం పొడిగించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధరణి పోర్టల్లో మార్పులు చేసిన తర్వాతే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం మొదలవుతుందని ధరణి కమిటీ సభ్యులు తెలిపారు. స్పెషల్ డ్రైవ్లో సుమారు లక్ష దరఖాస్తులకు సంబంధించిన నివేదికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లకు అధికారం ఇచ్చిన తర్వాతే వీటికి పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ధరణి కమిటీ సభ్యులు సునీల్కుమార్, కోదండరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. డ్రైవ్ మొదలైనప్పటి నుంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, రైతుల్లో ఆశ మొదలైందని తెలిపారు.