మహబూబాబాద్ : బీజేపీ , కాంగ్రెస్ లాంటి అభివృద్ధి నిరోధక పార్టీల ఆగడాలను ఎండగట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్న కేంద్రం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడుతున్నదని ఆయన మండిపడ్డారు. పాలకుర్తి నియోజకవర్గం నాంచారి మడూరు, వెలికట్ట గ్రామాల్లో బుధవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘
అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణకు అవార్డులిచ్చి అభినందిస్తారు. కానీ, నిధులను తగ్గించి నీరుగారుస్తున్నారని ఇటీవల ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానంలో విచారం వ్యక్తం చేశాన’ని పేర్కొన్నారు. ఇలాంటి ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేలా ప్రజలను సమాయత్తం చేయాలని కోరారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వపథకాలను ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు.
కేంద్రం వివక్షను చూపుతున్నా తెలంగాణను సీఎం కేసీఆర్(Chief Minister KCR, ) అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని అన్నారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన పల్లెలు నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో పరుగులు పెడుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సమృద్ధిగా సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు(Raitu Bandu), రైతు బీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని తెలిపారు.
రాష్ట్రానికి నయా పైసా ఇవ్వని బీజేపీ వాళ్లు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు అండగా నిలావాలని పార్టీ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు. ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.