వికారాబాద్ : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్పల్లి మండలం దార్గులపల్లి గ్రామంలో నిన్న రాత్రి పల్లె నిద్ర చేశారు. మంగళవారం తుమ్మలపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దళిత వాడలోని తలారి బాల్ రాజ్ ఇంట్లో బస చేసి ఉదయం లేచి గ్రామంలోని వీధుల్లో పర్యటించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో సమస్యలు పరిష్కరిస్తూ పల్లెలను అభివృద్ధి చేసేందుకు పల్లె నిద్ర కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. గ్రామస్తులతో కూర్చోని గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దార్గులపల్లి గ్రామంలో ఉన్న ఇంకుడు గుంతల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో శానిటేషన్ పనులు ఇంకా మెరుగ్గా జరగాలని ఎమ్మెల్యే సూచించారు. ఎస్సీ కాలనీలో ఉన్న నీటి బావి పైన జాలి ఏర్పాటు చేయాలన్నారు.
అదనపు మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు త్వరగా ఏర్పాటు చేయాలని, నాళాలు బిగించాలని అధికారులను ఆదేశించారు.తుమ్మలపల్లిలో దళిత వాడలో ప్రతి వీధిలో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు.
అలాగే తుమ్మలపల్లిలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బహిరంగ మల మూత్ర విసర్జన చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామస్థులందరూ కలిసి గ్రామ అభివృద్ధి కోసం పాటు పడాలన్నారు. హరితహారంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.