మహబూబాబాద్ : గ్రామస్థాయిలో వైద్యాధికారులు పర్యటిస్తూ వైద్య, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అనారోగ్యంగా ఉన్న వారి నమూనా ఫలితాల ఆధారంగా వైద్య చికిత్స అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ ముర్తుజా రిజ్వీ అధికారులను ఆదేశించారు. సోమవారం డోర్నకల్ మున్సిపల్ పరిధిలోని రైల్వే కమ్యూనిటీ హాల్లో కరోనా, సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ తో కలిసి జిల్లా వైద్య అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
జిల్లాలో వైద్య శాఖ కార్యకలాపాలను రిజ్వీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ఎప్పటికప్పుడు పారిశుధ్యం మెరుగు పరచాలన్నారు. తాగు క్లోరినేషన్ చేయాలన్నారు.
దోమలు పెరగకుండా దోమ లార్వా నిరోధించేందుకు క్షేత్ర స్థాయి అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సమీక్షలు నిర్వహించాలని మున్సిపల్ అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది తో చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీ స్థాయిలో ప్రతి రోజూ 300 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేపట్టాలని సూచించారు. గ్రామాలలో ఫీవర్ సర్వే చేపడుతూనే ఉండాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
కింది స్థాయిలో పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకొని పర్యవేక్షణ చేస్తూ గ్రామస్థాయిలో జ్వరాలు తగ్గించాలన్నారు. వైద్యాధికారులు స్థానికంగా ఉండాలన్నారు. జ్వరాలు వస్తే తాత్కాలికంగా వైద్యం చేసి ఊరుకో రాదని అధికారులతో సమన్వయం పెంచుకొని లోతుగా అధ్యయనం చేస్తూ పరిశోధన మొదలు పెట్టాలన్నారు. జ్వరాలు పెరగకుండా గ్రామస్థాయిలోనే నియంత్రించాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రాలలో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని, నిరుపేదలకు ఇబ్బందులు కలగకుండా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్డీ శ్రీనివాసరావు, టీఎస్ ఎస్ఎంఎస్ ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి డాక్టర్ గంగాధర్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా వైద్య శాఖ అధికారి హరీష్ రాజు, ఉప వైద్యాధికారి అంబరీష, కొవిడ్ నోడల్ అధికారి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ వీళ్లే
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు