ఆర్కేపురం, ఆగస్టు 5 : సమాజ ప్రగతిలో తొలి ఆయుర్వేద వైద్యులుగా, మంగళ వాయిద్య కళాకారులుగా, క్షురక వృత్తి దారులుగా సమున్నతంగా సేవలు అందించిన నాయీ బ్రాహ్మణులకు ఈ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ పేర్కొన్నారు. మంగళవారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ భవన్లో తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాయీ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణమోహన్తో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ..ఆధునిక వైద్యం, సాంకేతికత అందుబాటులోలేని రోజుల్లో అనేక మొండి వ్యాధులకు చికిత్సలు అందించి, గర్భిణులకు పురుడు పోసి, మంగళ వాయిద్యాలతో సైతం రోగ నివారణ చేసిన తొలితరం వైద్యులు నాయీ బ్రాహ్మణులేనని తెలిపారు.
సెలూన్లకు ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్తు, బీసీ బంధు పథకంలో ఒక లక్ష ఆర్థిక చేయూతనందించినది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకిషన్, ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గడల రాజు, సంఘం ప్రతినిధులు అంజలి, అనిత, సుష్మ, చింతల శ్రీనివాస్, విక్రమ్, ఎం.ప్రవీణ్, అంజయ్య, వెంకటేష్, నరసింహ, ఆర్.వినోద్ కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.