హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన చట్టాలను గవర్నర్ తిరస్కరించడం సరికాదని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1993 రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్సిపల్ చట్టం ఆధారంగానే మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల నియామకం కొనసాగుతున్నదని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2019 నూతన మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపాలిటీ చట్టాలపై అవగాహన కలిగిన నిపుణులు ఇద్దరిని, మైనార్టీ వర్గాల నుంచి మరో ఇద్దరిని కో ఆప్షన్ సభ్యులుగా తీసుకొనేలా, అందులో ఇద్దరు మహిళలు ఉండేలా చట్ట సవరణ చేశారని గుర్తుచేశారు. మున్సిపల్ నూతన చట్టం 2019 సెక్షన్ (4), 5 ప్రకారం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులకు కూడా కౌన్సిలర్లతో సమాన హోదా ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలోని పట్టణాల సంఖ్యతోపాటు, విస్తీర్ణం పెరగడం, పట్టణ ప్రగతితోపాటు వివిధ రకాల అభివృద్ధి పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తున్న నేపథ్యంలో పట్టణాభివృద్ధిలో నిపుణులు, మైనార్టీల సలహాలు, సూచనలు స్వీకరించడం కోసం మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ల సంఖ్య 6 నుంచి 10కి పెంచాలని ప్రభుత్వం చట్ట సవరణ చేయగా అసెంబ్లీ ఆమోదించిందని వెల్లడించారు. అంతటి ప్రాధాన్యమున్న బిల్లును గవర్నర్ తిరస్కరించడం సరైంది కాదని ధ్వజమెత్తారు. అదీగాక కో ఆప్షన్లకు ఓటుహక్కే లేనప్పుడు సంఖ్య పెంచితే అభ్యంతరం ఎందుకని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ తీరు అభ్యంతరకరమని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనే కుట్రతోనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.